కెసిఆర్ కేబినెట్ లో ఇద్దరు ‘రెడ్డి’ మంత్రులు అవుట్ ?

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పట్టు నిలుపుకోవాలని కేసీఆర్ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగమే దళితబంధు పథకం. అంతేకాక ఆ వర్గాన్ని సంత్రుప్తి పరచడానికి బండ శ్రీనివాసును ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి ఇద్దరు దళిత నేతలను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారని తెలిసింది. వారిలో ఒకరిని డిప్యూటీ సీఎంను చేయాలని అనుకుంటున్నారని సమాచారం. అలా అయితే ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఇద్దరికి స్థానచలనం తప్పదు. ఆ ఇద్దరూ రెడ్డి వర్గానికి చెందిన మంత్రులై ఉండవచ్చని, వారి తొలగించి ఆ స్థానాలను దళిత నేతలతో భర్తీ చేయనున్నారు. అపుడైతే లెక్క సరిపోతుంది.. సర్కారుకు దళితులంటే అమితప్రేమ ఉందని జనం భావిస్తారనేది గులాబీ అధినేత ప్లాన్.

ప్రస్తుత మంత్రులు మల్లారెడ్డి, జగదీష్ రెడ్డిలను బయటకు పంపేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయట. నార్త్ తెలంగాణ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సండ్ర వెంకట వీరయ్యల్లో ఒకరికి కేబినెట్లో చాన్స్ దక్కనున్నట్లు తెలిసింది. ఇక దక్షిణ తెలంగాణ నుంచి గువ్వల బాలరాజు పేరు వినిపిస్తోంది. అయితే ఇవన్నీ కేవలం రాజకీయ పరిశీలకుల అభిప్రాయాలు మాత్రమే. కేవలం ఎన్నికలను ద్రుష్టిలో పెట్టకునే దళితులకు పెద్దపీట వేస్తున్నారని దళిత సంఘాల నాయకులు,ఇతర పార్టీల నాయకులు విమర్శలు కూడా చేస్తున్నారు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే.. ఇప్పటికిప్పుడు దళితబంధును రాష్ట్రం మొత్తం అమలు చేయండని డిమాండ్ చేస్తున్నారు. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు పథకాన్ని అమలు చేస్తారనే ప్రశ్నకు టీఆర్ఎస్ నాయకులనుంచి గానీ, ప్రభుత్వ అధికారుల నుంచీ గానీ ఎటువంటి సమాధానం లేదు. ఎందుకంటే ఇది కేవలం పొలిటికల్ స్ర్టాటజీ మాత్రమే..