ఏంటో ఈ ప్రేమ ఎవరికీ అర్థం కాదు. ఎవరినీ ప్రశాంతంగా ఉంచదు. సాధారణంగా కుటుంబ సభ్యులు తమ ప్రేమను ఒప్పుకోకుంటే ఆత్మహత్యలు చేసుకున్న ప్రేమ జంటలను చూశాము. కానీ, ఇంట్లో ఒప్పుకున్నాక కూడా ఓ ప్రేమ జంట ఈ లోకాన్ని విడిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..గుంటూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో శ్రీకాంత్ (21), సౌమ్య (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ కూడా ఇచ్చారు. దాంతో తమ ప్రేమ పండిందని శ్రీకాంత్, సౌమ్య తెగ సంబరపడిపోయారు. కానీ, వీరి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. తాజాగా ఓ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డెకరేషన్ కోసం వెళ్లిన శ్రీకాంత్ విద్యుదాఘాతంతో మరణించాడు.
ప్రియుడి మరణ వార్త విన్న సౌమ్య తల్లడిల్లిపోయింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు ఇక రాడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సౌమ్య..విష గుళికలు మింగించే ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సౌమ్యను హాస్పటల్కి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. దాంతో ఇరు కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక శ్రీకాంత్, సౌమ్య ప్రేమకు గుర్తుగా ఇద్దరినీ ఒకే చోట ఖననం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన గ్రామ ప్రజలందరినీ విషాదంలోకి నెట్టేసింది.