పాపం.. లక్ష్మీపార్వతిపై అంబటికి ఎందుకో అంత కోపం..?

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి చైర్మన్ లక్ష్మీపార్వతికి ఇపుడు కొత్త చిక్కొచ్చి పడింది. అంత పెద్ద చైర్మన్ పదవిలో ఉన్న ఆమెను పార్టీలో పెద్దగా పట్టించుకోవడం లేదు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అయితే ఆమెను హేళనగా మాట్లాడారట. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటే.. పెద్దగా నవ్వి.. ప్రధాని, రాష్ట్రపతిలకు కూడా కంప్లైంట్ ఇచ్చుకో అన్నట్లు మాట్లాడాడట. ఇంతకీ విషయం ఏంటంటే.. లక్ష్మీపార్వతికి గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో 2.5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని ఆమె స్థానికంగా ఉండే ఓ వ్యక్తి సాగుచేస్తున్నాడు.

ఇటీవల ప్రభుత్వం ఉచిత బోర్ల పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ పథకంలో భాగంగా తన పొలంలో బోరు వేయించాలని పొలం సాగుచేస్తున్న వ్యక్తికి చెప్పింది. అయితే ఇందుకు స్థానికులు ఎందుకో అడ్డుపడుతున్నారు. అరె.. మాకే అడ్డు చెబుతారా.. అధికారంలో ఉన్నది మేమే.. మా ఎమ్మెల్యేకు చెబుతానుండండి అంటూ అతను సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు చెప్పాడు. అంబటి రాంబాబే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు.

దీంతో అంబటి రాంబాబు.. ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. లక్ష్మీపార్వతి పొలానికి సంబంధించిన విషయం నా వద్దకు తీసుకురావద్దని కరాఖండింగా చెప్పేశాడట. ఇదేందన్నా.. ఇలా అంటావు పెద్దోళ్లకు చెబుతాం చూడు అంటే.. ప్రధాని, రాష్ట్రపతిలకైనా సరే ఫిర్యాదు చేసుకోండి అన్నట్లు హేళనగా మాట్లాడాడట. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. సమస్యను పరిష్కరించుకోలేక.. పార్టీ పెద్దలకు చెప్పలేక.. ఇబ్బంది పడుతున్నారట.