ఇటీవలె వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్.. మళ్లీ శుక్రవారం చెన్నైకి చేరుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై రోజుల తర్వాత రజనీ చెన్నైకు చేరుకోవడంతో..అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటే.. జూలై 12న రజనీ అభిమానులతో భేటీ కానున్నారట. ఈ మేరకు తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు. గతంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో రజనీకాంత్ అభిమాన సంఘాలకు చెందిన నాయకులని కలిసారు. కానీ, అనారోగ్య సమస్యల కారణంగా రజనీ రాజకీయాల్లోకి రాకపోయారు.
ఇప్పుడు రజనీకాంత్ మరోసారి అభిమానులతో మీటింగ్ ఏర్పాటు చేయనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ భేటీలో రజనీ అభిమానులతో ఏం చర్చించబోతున్నారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, రజనీకాంత్ తాజా చిత్రం అన్నాత్తె నవంబర్ 4న విడుదల కానున్న సంగతి తెలిసిందే.