మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అధ్యక్ష పోటీ కోసం ఐదుగురు సెలబ్రెటీలు పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో.. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇండస్ట్రీ పెద్దలు మాత్రం ఏకగ్రీవానికే మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో `మా` లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని.. అందువల్ల వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని పదిహేను మంది సభ్యులు క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.
మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు జరగలేదని, దాంతో కార్యవర్గం లేకుండానే నడుస్తోందని.. కాబట్టి, క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా, ‘మా’లో సీనియర్ సభ్యుడిగా ఉన్నందున మీరే ఆ బాధ్యతలు చేపట్టి వెంటనే ఎన్నికలు జరపాలని లేఖలో పేర్కొన్నారట. ఈ నేపథ్యంలోనే రేపు సాయంతం ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సమావేశం కాబోతోన్నారు.