మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రిమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళమ్ రీమేక్, బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. చిరు మరో డైరెక్టర్కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. సంపత్ నంది. తాజాగా సంపత్ చిరును కలిసి ఓ కథను వినిపించాడట. అది ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక ఉన్నట్టు ఉంది ఈ ప్రచారం జరగడానికి కారణం లేకపోలేదు. తాజాగా సంపత్ నంది చిరుతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. అంతేకాదు, తన లాంటి ఎంతో మందికి దేవుడైన చిరును కలవడాన్ని ఎప్పటికీ మరవలేను అంటూ ఆసక్తికర కామెంట్ కూడా పెట్టాడు. దాంతో ఈ పోస్ట్ వైరల్ కాగా.. సంపత్-చిరు కాంబోలో త్వరలోనే ఓ సినిమా రాబోతోందంటూ ప్రచారం ఊపందుకుంది.