బాలీవుడ్ లో ఖాన్ లలో ఒకరైన సల్మాన్ఖాన్ పై చండీగఢ్ లో తాజాగా చీటింగ్ కేసు నమోదైంది. సళ్లు భాయ్ సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు ఆయనకు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కు చెందిన మొత్తం 7 మందిపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే ఈ ఫిరాదుపై జూలై 13లోపు వారు వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు. ఈ ఆరోపణలలో ఏదైనా నేర కోణం దాగుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు.
ఈ ఫిర్యాదులో అరుణ్ గుప్తా .. ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు నన్ను ఆ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని అడిగారనీ.. అందుకోసం పెట్టుబడి ఖర్చు మొత్తంగా రూ.2 కోట్లు వరకు అవుతుందని చెప్పగా అందుకు అంగీకరించి అంత మోత్తాన్ని ఖర్చు పెట్టినట్లు చెప్పాడు. ఇక వారు చెప్పినట్లు షోరూమ్ తెరిచిన సంవత్సరం గడుస్తున్న, తనకు సదరు సంస్థ నుంచి ఏ వస్తువులు రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. మొదట్లో ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు కూడా సల్మాన్ ఖాన్ తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారని.. ఈ క్రమంలో అతను సల్మాన్ ఖాన్ ను కలుసుకోగా, షోరూమ్ ను ప్రారంభించేందుకు కూడా తాను వస్తానని హామీ ఇచ్చినట్లు తెలియచేసాడు. కాకపోతే ఆ తర్వాత సల్మాన్ రాలేదని ఆ వ్యక్తి తెలిపారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ తోపాటు ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మొత్తం 7 మందిపై కేసు నమోదైంది.