ఆనందయ్య మందు విషయంలో బంపర్ ఆఫర్..!

ఆనందయ్య ఔషధానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఏపీ హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రావటంతో కృష్ణపట్నంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 21 నుంచీ పోలీసుల భద్రతలో ఉన్న ఆనందయ్య ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి సోమవారం సొంతూరిలో అడుగుపెట్టడంతో కోలాహలంగా మారింది. ఏపీ ప్రభుత్వ అనుమతి లభించటంతో ఔషధం తయారీని ప్రారంభించేందుకు ఆనందయ్య, ఆయన శిష్యులు సన్నద్ధమవుతున్నారు. ఔషధాల కొరత ఉందని, వాటిని సేకరించుకునేందుకు కనీసం 3 రోజుల సమయం పడుతుందని చెప్పారు. ఔషధ పంపిణీపై జిల్లా అధికారులు ఓ విధానాన్ని రూపొందిస్తారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి తెలిపారు. అప్పటివరకూ ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని కోరారు. మందు పంపిణీ అయితే చాలా మంది కరోనా నుంచి కోలుకునే అవకాశం ఉందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ఆనందయ్య మందు ఎన్నో ప్రాణాలను కాపాడగలదని ఆనందపడుతున్నారు.