మెసేజ్ చేస్తే హెల్ప్ చేస్తా అంటున్న రేణు దేశాయ్‌!

సెకెండ్ వైవ్‌లో క‌రోనా వైర‌స్ వేగం ఎంత ఉధృతంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా హాస్పిటల్‌లో బెడ్స్‌ దొరక్క పోవడం, ఆక్సిజన్ కొర‌త కార‌ణంగానే చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నారు. అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, న‌టి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చ‌టించింది. ఈ క్ర‌మంలోనే రేణు.. `నా ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌ ఇన్‌ బాక్స్‌ ఇప్పటి నుంచి ఓపెన్‌లో పెడతా.

ప్లాస్మా లేదా ఆక్సిజన్‌ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్‌ లేదా మందులు.. వంటివి అవసరం ఉంటే నాకు మెసేజ్‌ చేస్తే, వారికి హెల్ప్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. నిజంగా అవసరం ఉన్నవారే మెసేజ్‌ ద్వారా కాంటాక్ట్‌ అవ్వాలి. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సహాయం మాత్రం చేయలేను` అని పేర్కొంది. ఇక క‌రోనా పోరుపై రేణు కూడా ముందుకు వ‌చ్చినందుకు..ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.