భార్య‌ను చంపి.. ఆపై సెల్ఫీ దిగిన భ‌ర్త‌..!

అనుమానం పెనుభూతం. ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న‌ది. భార్య‌భ‌ర్త‌లను శ‌త్రువులుగా మార్చుతున్న‌ది. ఇది హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు దారి తీస్తున్న‌ది. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. పెళ్లియిన ఏడునెల‌ల‌కే క‌ట్టుకున్న భార్య‌ను క‌త్తితో పొడిచి చంపాడు ఓ క‌సాయి. ఈ సంఘ‌ట‌న ఏపీలో వెలుగుచూసింది. అధికారులు, స్థానికులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. క‌డ‌ప జిల్లా బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన హ‌రి, మంజుల (23) దంప‌తులు. వారిరువురికి ఏడు నెల‌ల క్రిత‌మే వివాహామైంది. ఇదిలా ఉండ‌గా భర్త హరి పెళ్ల‌యిన నాటి నుంచి భార్య‌ను అనుమానించ‌డం మొద‌లు పెట్టాడు. ఈ నేప‌థ్యంలోనే శుక్ర‌వారం రాత్రి భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్ర‌మంలో క‌త్తితో పొడిచి దారుణంగా హ‌త‌మార్చాడు. అక్క‌డితో ఆగ‌కుండా హత్య చేసిన అనంత‌రం భార్య శ‌వంతో సెల్ఫీ తీసుకున్నాడు ఆ ఉన్మాది. స్థానికుల ద్వారా సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు.

ఇక ఇలాంటి సంఘ‌ట‌నే తెలంగాణ రాష్టంలోనూ వెలుగు చూసింది. వికారాబాద్‌ జిల్లా బంట్వారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మద్వాపూర్‌ గ్రామానికి చెందిన ఆంజనేయులు, లక్ష్మి(40)లకు 23 ఏళ్ల క్రితం వివాహామైంది. రోజు వారీ కూలి చేసుకుంటూ తాండూరులో జీవిస్తున్నారు. అయితే భార్య‌పై అనుమానం పెంచుకున్న ఆంజ‌నేయులు త‌ర‌చూ ఆమెను వేధించేవాడు. దాడుల‌కు దిగేవాడు. ఈ నేప‌థ్యంలోనే మూడేళ్ల క్రితం భ‌ర్త‌ను విడిచి ల‌క్ష్మి త‌న పుట్టింటికి వెళ్లింది. ఇటీవ‌లే పెద్ద‌మ‌నుషుల పంచాయితీ పెట్టి ఒప్పించి ఆమెను ఇంటికి తీసుకువచ్చినా ఆమె మ‌ళ్లీ త‌ల్లిగారింటికి వెళ్లింది. దీంతో మ‌ళ్లీ మద్వాపూర్‌కు వెళ్లి భార్య‌ను తీసుకుని వెళ్లి శుక్ర‌వారం సాయంత్రం ఇంటికి తీసుకువచ్చాడు. అదే రాత్రి 12గంటల సమయంలో లక్ష్మి(40) నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కాళ్లు కట్టివేసి కత్తితో మెడ, చేతులపై పొడిచి హత్యచేశాడు. ఇంట్లో నుంచి అరుపులు రావడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వ‌గా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆంజనేయులుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.