అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించగా.. తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ మే 12 నుంచి లాక్డౌన్ విధించారు. ఇక అప్పటి నుంచి కరోనా కేసులు అదుపులోకి రావడం మొదలయ్యాయి.
అయితే నేటితో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ముగియనుంది. దీంతో మరోసారి లాక్డౌన్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలోనే నేటి మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతోంది. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… లాక్ డౌన్ ను మరో వారం లేదా పది రోజుల పాటు కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. కానీ, నేటి వరకు ఉదయం 6 నుండి పదిగంటల వరకు లాక్డౌన్ ఆంక్షలు సడలించగా.. సోమవారం నుండి ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పొడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.