నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య నాటు మందు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయుర్వేద పద్దతులతో ఆనందయ్య తయారు చేసిన మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో.. జనాలు ఆ మందు కోసం ఎగబడ్డారు.
దీంతో ఆ నాటు మందుపై పూర్తి స్థాయి పరిశోధనలు చేసే వరకు పంపిణీని ఏపీ సర్కార్ నిలిపివేసింది. అలాగే ఆనందయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని.. శుక్రవారం ఇంటి వద్ద దించారు. అయితే మళ్లీ నేటి తెల్లవారుజామున ప్రత్యేక బందోబస్తు మధ్య ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు.
ఆయనను ఎక్కడికి తరలించారన్న విషయం తెలియకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆనందయ్య నాటు మందుపై సోమవారం నివేదిక రానుంది. ఇక అప్పటి వరకు ఆనందయ్యను రహస్య ప్రాంతంలోనే ఉంచుతారని సమాచారం. మరోవైపు కృష్ణపట్నంలో ఇప్పటికే విధించిన 144 సెక్షన్ను కొనసాగిస్తున్నారు.