కంటిని కనిపించని కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ వేవ్లో రూపంలో దేశ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు కరోనా కాటుకు వేల మంది బలైపోతున్నారు. పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్లో ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో.. ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు.
ఈ క్రమంలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా కరోనాపై పోరాటానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీ తమిళనాడు ప్రభుత్వానికి రూ. కోటి విరాళం అంజేశారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధిని సేకరించే చర్యలకు శ్రీకారం చుట్టింది.
అందులో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ విరాళాలు అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే సూర్య తండ్రి శివకుమార్ తమ ఫ్యామిలీ తరఫున రూ.కోటి విరాళం ప్రకటించారు. శివకుమార్, సూర్య, కార్తి తమిళనాడు సీఎం స్టాలిన్ను స్వయంగా కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు.