ప‌వ‌న్ `వీరమల్లు` విడుద‌ల‌ అప్పుడేన‌ట‌..?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మెగాసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఏ.ఎంరత్నం నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌, జాక్వలిన్‌ ఫెర్నాండేజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ప‌వ‌న్ కెరీర్‌లో పీరియాడికల్‌ నేపథ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ఇదే. అందువ‌ల్లే, ఈ చిత్రం కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుద‌లపై, షూటింగ్‌పై నిర్మాత ఏ.ఎం ర‌త్నం తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 6వ తేదీ వరకూ కొన‌సాగిన ఈ సినిమా షూటింగ్‌.. ఆ తరువాత కరోనా ఉద్ధృతికి ఆగిపోయింది.

తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాము. సెట్లో అడుగుపెట్టడానికి పవన్ కూడా సిద్ధంగా ఉన్నారు. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్‌ను పూర్తి చేసి.. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాము అంటూ ఏ.ఎంర‌త్నం చెప్పుకొచ్చారు. అంటే వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో వీర‌మ‌ల్లు దిగ‌నుంద‌న్న‌మాట‌.