కొడుకు అమానుషం.. తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు స‌సేమిరా..

క‌రోనా వైర‌స్ మాన‌వ సంబంధాల‌ను మంట‌గ‌లుపుతున్న‌ది. కుటుంబ అనుబంధాల‌ను సైతం చిధ్రం చేస్తున్న‌ది. అప్యాయ‌త పంచాల్సిన వారే అనుమానంతో ప‌రాయివాళ్లుగా మారేలా చేస్తున్న‌ది. అంద‌రూ ఉన్నా అనాథాలుగా మారాల్సిన దుస్థితికి తీసుకొస్తున్న‌ది. వైర‌స్ బారిన ప‌డిన త‌ల్లిదండ్రుల‌ను, పిల్ల‌ల‌ను కొంద‌రు ప్రాణాల‌కు తెగించి కాపాడుకుంటుంటే, మ‌రికొంద‌రు మాత్రం బ‌తుకుతీపితో అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది కృష్ణ‌జిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘ‌ట‌న‌. కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ తండ్రి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించకుండా వెళ్లిపోయాడు ఓ దుర్మార్గ కొడుకు. వివ‌రాల్లోకి వెళ్లితే..

కృష్ణాజిల్లా చినతాడినాడకు చెందిన రాంబాబు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నను బైక్ కూర్చోబెట్టుకుని వైద్య‌శాల‌కు బయల్దేరాడు అల్లుడు నరసింహారావు. అయితే అల్లునికి దివ్యాంగుడు.. మాట్లాడలేడు, చెవులు కూడా వినిపించవు.. ఈ క్ర‌మంలో అడ్రస్‌ దొరక్క స్థానికులను ఆరా తీస్తూ చివ‌ర‌కు ఆకివీడు ప్రభుత్వ వైద్య‌శాల‌కు తీసుకెళ్లాడు. డాక్టర్లు పరిశీలించి రాంబాబు మార్గమధ్యలోనే మృతి చెందిన‌ట్లు నిర్ధారించారు. అనంత‌రం రాంబాబు మృత‌దేహానికి కరోనా టెస్ట్‌ చేయగా, నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఇదిలా ఉండ‌గా మృతుడి కుమారుడికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు వైద్య సిబ్బంది. అయితే, ప్రస్తుతం తాను ఊర్లో లేనని, మీరే కార్యం కానిచ్చేయండి అంటూ బ‌దులివ్వ‌డంతో వైద్యులు షాక్ ఖంగుతిన్నారు. వెంటనే చిన్నతాడినాడ సర్పంచ్‌కు సమాచార‌మివ్వ‌గా, ఆయ‌న గ్రామ కార్యదర్శి, సచివాలయ ఉద్యోగులను పంపి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలిచి వేసింది.