బీజేపీలోకి ఈటల.. ముహూర్తం ఖరారు!

గత రెండు రోజులుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలతో ఈటల రాజేందర్ మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి. దీంతో ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో బీజేపీలో ఈటల చేరుతారనే విషయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఈటల పార్టీలో చేరే విషయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఢిల్లీ నేతలతో మాట్లాడారు. ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ ఢిల్లీ నేతలకు చెప్పారు. బీజేపీ ఉద్యమకారులకు ప్రాధాన్యతతో పాటు తగిన గౌరవం కూడా ఇస్తుందని ఢిల్లీ నేతలు బండి సంజయ్ తో అన్నారు.

ఈటల రాజేందర్ పార్టీలో చేరే విషయంపై బండి సంజయ్ రాష్ట్ర నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఈటలను బీజేపీలో చేర్చుకోవాలని రాష్ట్ర నేతలు ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఈటల రాజేందర్ బీజేపీలో ఎప్పుడు చేరుతాడనే దానిపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెలిపింది. ఈటలకు హామీ ఇవ్వడంపై ఎలాంటి చర్చ జరగలేదని.. ఆయన రాజీనామా ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పార్టీలో చేరాలి అనే విషయాలపై కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.