ఆ సూప‌ర్ హిట్ చిత్రానికి సీక్వెల్ చేయ‌బోతున్న రామ్‌చ‌ర‌ణ్‌?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `రంగ‌స్థ‌లం`. ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించారు.

భారీ అంచ‌నాల న‌డుము 2018లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారనే వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రంగ‌స్థ‌లానికి సీక్వెల్ చేస్తే బాగుంటుంద‌ని సుకుమార్, చరణ్ ఇద్దరూ భావిస్తున్నారని తెలుస్తుంది.

ఈ సీక్వెల్‌ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించ‌నున్నార‌ని అంటున్నారు. కాగా, ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్న చ‌ర‌ణ్‌.. ఆ త‌ర్వాత శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంతో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లం సీక్వెల్ చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.