ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా కాటుకు ఎందరో సినీ ప్రముఖులు బలైపోయారు. మరికొందరు అనారోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచారు. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కె.వి.ఆనంద్ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. ప్రేమదేశం, ఒకేఒక్కడు, శివాజీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా ఆనంద్ పని చేశారు. ఆ తర్వాత కణా కండేన్ సినిమాతో దర్శకుడిగా మారిన ఆనంద్.. సూర్య హీరోగా అయాన్(తెలుగులో వీడొక్కడే)ను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు.
ఇక రంగం సినిమాతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆనంద్ మృతి చెందడంతో.. చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులందరూ ఆనంద్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.