గుణశేఖర్‌కు క‌రోనా..ఆగిన స‌మంత సినిమా!?

క‌రోనా సెకెండ్ వేవ్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్ మాదిరి.. టాలీవుడ్‌లోనూ క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ఎంద‌రో సినీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌గా.. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌కు కూడా క‌రోనా సోకిన‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు క‌రోనా బారిన ప‌డ‌గా.. ఆయ‌న ద్వారానే గుణ‌శేఖ‌ర్‌కు సోకింద‌ని అంటున్నారు. ఇటీవ‌ల ప‌వ‌న్ కళ్యాణ్‌- హ‌రీష్ శంక‌ర్ మూవీకి సంబంధించి ఫొటో షూట్ జ‌రుగుతుంటే అక్క‌డికి వెళ్లిన దిల్ రాజు.. ఆ ప‌క్క‌నే శాకుంత‌లం షూటింగ్ జ‌రుగుతుండ‌డంతో అక్కడికి వెళ్లి గుణ‌శేఖ‌ర్‌ను క‌లిసాడ‌ట‌. దీంతో గుణ‌శేఖ‌ర్ కూడా క‌రోనా బారిన ప‌డ్డార‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం గుణ‌శేఖ‌ర్ క్వారంటైన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కాగా, గుణ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం స‌మంత‌తో `శాకుంత‌లం` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో స‌మంత‌కు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ న‌టిస్తున్నాడు. ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ప్ర‌స్తుతం గుణ‌శేఖ‌ర్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో.. షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది.