ఏపీలో భారీగా క‌రోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్య‌ధికం!

ఆ మ‌ధ్య త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ వీర విహారం చేస్తోంది. గ‌త రెండో వారాలుగా అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా పాజిట‌వ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా సాగుతున్నా.. క‌రోనా విజృంభిస్తూనే ఉంది.

ఏపీలోనూ క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. నిన్నొక్క‌రోజే రాష్ట్రంలో ఏకంగా మూడు వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,309 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 9,21,906 కి చేరింది. చిత్తూరు జిల్లాలోనే భారీ స్థాయిలో 740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అలాగే నిన్న 12 మంది క‌రోనా మ‌హ‌మ్మారికి బ‌లైపోయారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,291కు చేరుకున్నాయి. ఇక‌ కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 1,053 నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 8,95,949 కి చేరుకుంది. దీంతో ప్ర‌స్తుతం ఏపీలో 18,666 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్న ఒక్క రోజే 31,929 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.