ఏపీలో విపక్ష వైసీపీకి ప్లీనరి తర్వాత ఎక్కడా లేని జోష్ వచ్చేసింది. కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగి ఖాళీగా ఉంటోన్న వాళ్లు, ఇతర సీనియర్ నాయకులు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీలో చేరితే ఎలా ఉంటుందా ? అన్న ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ బలంగా ఉన్న కర్నూలు జిల్లాలో పట్టున్న మాజీ సీఎం కోట్ల విజయ్భాస్కర్రెడ్డి ఫ్యామిలీ వైసీపీలో చేరుతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఉన్న కోట్ల తన ఫ్యూచర్తో పాటు కుమారుడు ఫ్యూచర్ కోసం వైసీపీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్లీనరీ అయిపోయిన మరుసటి రోజు కొందరు వైసీపీ సీనియర్ నేతలతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చర్చించారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేయాలని కోట్ల భావిస్తున్నారు. ఇక తన తనయుడు రాఘవేంద్రరెడ్డిని జిల్లాలో తమకు పట్టున్న ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనుకుంటున్నారు.
కోట్ల ఫ్యామిలీ వైసీపీ ఎంట్రీకి జగన్ సైతం సుముఖంగానే ఉన్నారు. కోట్లకు కర్నూలు ఎంపీ టిక్కెట్టుతో పాటు ఆయన తనయుడికి డోన్, పత్తికొండ, ఆలూరులో ఏదో ఒక సీటు కూడా ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కోట్ల ఫ్యామిలీ వైసీపీ ఎంట్రీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం కర్నూలు సిట్టింగ్ ఎంపీగా బుట్టా రేణుక సీటుకు ఎర్త్ తప్పదు.
వాస్తవానికి గత ఎన్నికల తర్వాత రేణుక భర్త టీడీపీ గూటిలో చేరిపోయారు. బుట్టా రేణుకకు ఎటూ వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు ఇవ్వకూడదని జగన్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి టీడీపీలోకి వెళ్లినప్పుడే రేణుక కూడా పార్టీ మారాలని అనుకుని…చివరి క్షణంలో ఆమె తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.
ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కోట్ల ఎంట్రీతో రేణుకకు టిక్కెట్ రాదన్న విషయం ఆమెకు అర్థమైంది. ఈ క్రమంలోనే ఆమె టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. టీడీపీలోకి జంప్ చేసే రేణుక తనకు ఎంపీ టిక్కెట్టు కావాలని చంద్రబాబును కోరనున్నట్టు తెలుస్తోంది.