కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరు పోటాచేయాలనే అంశంపై టీడీపీలో తీవ్ర తర్జజభర్జనలు కొనసాగుతున్నాయి. సీటు మాకు కేటాయించాలంటే మాకు కేటాయించాలని అటు శిల్పా, ఇటు భూమా వర్గాలు పట్టు పడుతున్నాయి. అధికార పార్టీలో ఇంత గందరగోళం నడుస్తుంటే.. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ మాత్రం కూల్గా ఉన్నారు. అభ్యర్థిపై ఇంకా క్లారిటీ లేకున్నా.. ధీమాగా ఉన్నారు. దీని వెనుక ఆయన వ్యూహం కూడా లేకపోలేదట. ఈ రెండు వర్గాల్లో ఓట్ల చీలిక ఏర్పడితే అది తమకు లాభిస్తుందని జగన్ భావిస్తున్నారట. అయితే తమకు బలమున్న స్థానంలో.. అభ్యర్థిని దించకుండా.. ఈ చీలికను నమ్ముకోవడం ఎంత వరకూ సమంజసమనేది నేతల అభిప్రాయం!!
నంద్యాల ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య చాలా హడావుడి జరుగుతోంది. వైకాపా టికెట్ మీద గత ఎన్నికల్లో గెలిచి, ఆ తరువాత టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణించారు. దాంతో నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తమ కుటుంబానికే టీడీపీ సీటు ఇవ్వాలంటూ భూమా అఖిల ప్రియ వర్గం పట్టుబడుతుంటే… చాలారోజులుగా పార్టీని నమ్ముకుని ఉన్న తమకు అవకాశం కల్పించాలంటూ శిల్పా వర్గం కూడా ఉడుం పట్టుతో ఉంది. ఈ రెండు వర్గాల మధ్య సీఎం చంద్రబాబు రాజీ కుదిర్చినట్టు చెబుతున్ననా ఎంతవరకూ సహకరించుకుంటాయో తెలియని పరిస్థితి.
ప్రధాన ప్రతిపక్షమైన వైకాపాలో దీని గురించి చర్చే లేదు! కారణం ఏంటి..? ఇది జగన్ వ్యూహాత్మక మౌనమా..? లేదా, వేరే పరిణామాల గురించి ఎదురు చూస్తున్నారా..? ఇలాంటి ప్రశ్నలు వైకాపా వర్గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. భూమా టీడీపీలో చేరిన తర్వాత నంద్యాల నుంచి వైకాపాకి ప్రాతినిధ్యం లేనట్టే అయింది. కానీ, సంస్థాగతంగా వైకాపాకి నంద్యాలలో మంచి పట్టు ఉంది. అయినా సరే, అభ్యర్థి ఎంపిక విషయంలో జగన్ మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. ఆ పార్టీ నుంచి బరిలోకి దిగేది ఎవరూ అనేది ఇప్పటికే ఎంపిక చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
జగన్ వ్యూహం మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. నంద్యాల టికెట్ విషయమై టీడీపీలో చీలిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. శిల్పా, భూమా వర్గాల్లో ఒక వర్గం తీవ్ర అసంతృప్తికి గురి కావడం ఖాయం. ఆ అవకాశాన్ని వైకాపాకు అనుకూలంగా మార్చుతూ… చీలిక వర్గానికి టిక్కెట్టు ఇస్తే, గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని జగన్ భావిస్తున్నారట. టీడీపీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చలేదు కాబట్టి.. ఆ అవకాశం కోసం జగన్ ఎదురు చూస్తున్నారట. ఉప ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉన్నప్పుడు ఎవరో చీలిక నేత వస్తారని ఎదురుచూడ్డం ఎంతవరకూ కరెక్ట్ అనేది విశ్లేషకుల ప్రశ్న!!