ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమేనంటున్నారు పశ్చిమగోదావరికి చెందిన టీడీపీ నేతలు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ముద్రగడ పద్మనాభం చేస్తున్న కాపు ఉద్యమంతోనే చంద్రాబాబుకు తిక్కపుడుతుంటే.. పశ్చిమ గోదావరి కి చెందిన మరో నేత మాదిగ సభ నిర్వహిస్తానని, తన తఢాకా చూపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఉద్యమానికి కులం కలరింగ్ వస్తే.. బాబు డోలాయమానంలో పడడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి కుల ఉద్యమాలకు రాష్ట్రంలో కొత్తకాదు. అయినా.. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఉద్యమాలు ఉవ్వెత్తున సాగడం, 2019 ఎన్నికల్లో ప్రభావం పడుతుందనే భయం బాబును వెంటాడుతుండడం పెద్ద చర్చనీయాంశమైంది.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు.. పార్టీలో సీనియర్ నేత. 2014లో పార్టీ కోసం ఎంతో ప్రచారం చేసి పెట్టారు. దీంతో ఎమ్మెల్యే సీటు దక్కకపోయినా.. ప్రభుత్వంలో ఏదో ఒక పదవి దక్కుతుందని భావించారు. అయితే, బాబు ఈయనను పట్టించుకోలేదు. దీంతో మరో రెండున్నరేళ్లలో ప్రభుత్వ గడువు తీరిపోతున్న నేపథ్యంలో బాబు పై ఒత్తిడి పెంచాలని రామారావు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తనకు ఎలాంటి గుర్తింపూ లేదని, పార్టీ కోసం ఎంతో కృషి చేశానని, అయినా తనను గుర్తించలేదని రామారావు వాపోయారు.
అదేసమయంలో తన సామాజిక దళిత వర్గానికే చెందిన జూపూడి ప్రభాకర్, కారెం శివాజీల నియామకంపైనా రామారావు చిర్రుబుర్రులాడారు. వాళ్లిద్దరూ బాబును ఒకప్పుడు ఏకేశారని, అయినా వారిని తెచ్చి చంకనెక్కించుకున్నారని, మేం బాబును దైవంగా కొలిచామని అందుకేనా మమ్మల్ని పక్కన పెడుతున్నారంటూ మనసులో మాటను మీడియా ముందు అనేశారు. అంతేనా.. ఆర్టీసీ చైర్మన్పదవిని తనకు కట్టబెట్టాలని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాదు, అలా చేయకపోతే… మాదిగ మేధావులతో సదసు నిర్వహించి బాబును ఏకేయడం ఖాయమని హెచ్చరించారు. దీంతో దీనికి నిజంగానే కులం కలరింగ్ వస్తే. బాబుకు మరో కుల పోరాటం సెగ ఖాయంగా కనిపిస్తోంది. మరి బాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో.. రామారావును ఎలా చల్లబరుస్తారో చూడాలి.