నిజంగా వారంతా నయీమ్‌ బాధితులేనా?

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత రాజకీయ వర్గాలలో ప్రకంపనలు కనిపిస్తున్నాయి. పోలీసులు అధికారికంగా ఏ రాజకీయ నాయకుడి పేరూ ప్రకటించకపోయినా మీడియా, రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న ఊహాగానాలతో రాజకీయ నాయకులు అలర్ట్‌ అవుతున్నారు. ‘గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు’ అన్న చందాన రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగానే ఉంది.

ఇంకొందరు రాజకీయ నాయకులు మాత్రం తమ పేరు మీడియాలో రావడం పట్ల వివరణ ఇస్తున్నారు. అది వారి బాధ్యత. అలా మీడియా ముందుకు వచ్చిన వారిలో టిడిపి నాయకురాలు ఉమా మాధవరెడ్డి, టిఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ ఉన్నారు. కర్నె ప్రభాకర్‌ అయితే, తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై డిజిపికి ఫిర్యాదు చేశారు. ఇంకో వైపున కాంగ్రెసు నాయకుడు, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నయీం తనను బెదిరించారని ఆరోపించారు. ఆరోపణలు చేయడమెందుకు, ఆధారాలు తీసుకెళ్ళి సిబిఐకి ఇస్తే సరిపోతుంది.

కానీ అధికార పార్టీ నేతలకు ఉన్న ఈ వెసులుబాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులకు ఉండదు. పోలీసు అధికారులపైనా ఆరోపణలు వస్తున్నాయి. మాజీ డిజిపి తనపై వచ్చిన ఆరోపణల్ని ఇప్పటికే ఖండించారు. ఇంకో మాజీ పోలీస్‌ అధికారి ఒకరు తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తూ మీడియాకి వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా నయీంపై ఫిర్యాదులు చేస్తున్న బాధితుల్లో కొందరు ఫేక్‌గాళ్ళు కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.