టీడీపీ, టీఆర్‌ఎస్‌ ఆశలపై కేంద్రం నీళ్ళు

పార్టీ ఫిరాయింపులకు పాల్పడేందుకు తెలంగాణలో టిఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి వాడుకున్న అస్త్రం ‘అసెంబ్లీ సీట్ల పెంపు’. ఆకాశంలో మేడలు కట్టేయడంలో ఈ రెండు పార్టీలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. 2019 నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి, ‘ఈలోగా మా పార్టీలోకి వచ్చెయ్యండి’ అని విపక్ష నేతలకు గాలం వేశాయి టిడిపి, టిఆర్‌ఎస్‌.

ఈ మూడు నాలుగేళ్ళు అధికారంలో ఉంటాం, ఆ తర్వాత సీటు గ్యారంటీ అనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిథులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పార్టీలు ఫిరాయించేశారు. కానీ కేంద్రం టిడిపి, టిఆర్‌ఎస్‌ ఆశలపైనా, పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిథులపైనా నీళ్ళు చల్లేసింది. ఇప్పట్లో నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కుండబద్దలుగొట్టేసింది. దాంతో పార్టీ ఫిరాయించిన నేతల్లోనూ, టిడిపితోపాటు టిఆర్‌ఎస్‌లోనూ ఆందోళన కలుగుతోందిట.

ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాల తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కతాటిపైకి రానున్నారని తెలియవస్తోంది. విభజన చట్టంలో నియోజకవర్గాల పెంపు అంశం ప్రతిపాదనగా ఉంది. దాన్నే కేంద్రానికి తెలియజేయాలనుకుంటున్నారట చంద్రబాబు, కెసియార్‌. నీటి వివాదాలు, హైకోర్టు వివాదంపై ఇద్దరూ ఒక్కచోట కూర్చుని పరిష్కారం వెతకడంలేదుగానీ, రాజకీయంగా తమకు అవసరమయ్యే అంశాల కోసం పాకులాడుతుండడం శోచనీయం.