ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్తో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని, సినిమాలో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటు పలువురు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పి రూ.50 లక్షల రూపాయలతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అనుష్క, మణిశర్మ తో అపాయింట్మెంట్ ఇప్పిస్తామంటూ ఓ కేటుగాడు.. టాలీవుడ్ లోని విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత నిర్మాత లక్ష్మన్ చారి నుంచి రూ.50 లక్షల రూపాయల నగుదును వసూల్ చేసినట్టు తెలుస్తుంది. అనుష్కతో మీ బ్యానర్లో సినిమా అవకాశం ఇప్పిస్తానంటూ నిర్మాతను ఎన్నోసార్లు బెంగళూరు తీసుకువెళ్లిన ఆ కేటుగాడు.. మొదట రూ.26 లక్షలు వసూల్ చేసి.. ఆ తర్వాత మణిశర్మ పేరు చెప్పి మరికొంత డబ్బును రాబట్టు కొన్నాడు.. మొత్తంగా రూ.50లక్షలకు పైగా వసూల్ చేసి నిర్మాతను నట్టేట ముంచాడు.
ఆ కేటుగాడు చేతిలో మోసపోయానని గుర్తించిన లక్ష్మన్చారి.. టాలీవుడ్ ఫిలిం చాంబర్ ని ఆశ్రయించాడు. మొదట డబ్బు వెనక్కి ఇస్తానని చెప్పిన ఆ కేటుగాడు.. ఆ తర్వాత నిర్మాతనే బెదిరించడం మొదలు పెట్టాడు. డబ్బులు అడిగితే ఆడవాళ్ళతో కేసులు పెట్టిస్తానని నానా యాగీ చేయడం మొదలుపెట్టాడు. చివరికి ఆ నిర్మాత చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.