మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా.. టాలీవుడ్లో అంచలంచలుగా ఎదుగుతూ మెగా సామ్రాజ్యాన్నే నిర్మించారు. ఇక ఎంత ఎదిగినా ఎప్పుడూ ఒదిగే ఉండే చిరు రైతుగా మారి.. తన ఇంటి పెరట్లో అనపకాయలను పండించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 23న జాతీయ జాతీయ రైతుదినోత్సవం సందర్భంగా చిరు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో చిరంజీవి.. `కొన్ని నెలల క్రితం మా పెరట్లో ఆనపకాయ (సొరకాయ) విత్తనం ఒకటి పాతాను. అది పెద్ద పాదై.. రెండు ఆనపకాయలను కాసింది` అని చెప్పుకొచ్చారు. అలాగే పెరట్లో కాసిన సొరకాయలను స్వయంగా ఆయనే కోసి ఎంతగానో మురిసిపోయారు. అనంతరం మాట్లాడుతూ.. `ప్రకృతి ఎంత గొప్పది అంటే.. మనం సరదాగా ఒక విత్తనం భూమిలో నాటితే, అది మనకు కడుపునింపే ప్రయత్నం చేస్తుంది. దానికి ఎంతమంది కృతజ్ఞతగా ఉన్నాము.. ఉండాలి అని చెప్పడం నా ఉద్దేశ్యం. మరియు మీరు కూడా ఇలా మీ ఇళ్లలో చిన్న ప్రయత్నం చేయండి.` అని చెప్పుకొచ్చారు.
ఇక పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అంతేకాదు.. అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు కి సెల్యూట్ చెప్పారు చిరు. దీంతో ఆయన వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది.
కాగా, చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఈయన నటించిన ఆచార్య చిత్రం విడుదల సిద్ధంగా ఉంది. అలాగే మరోవైపు ఈయన మెహర్ రామేష్ దర్శకత్వంలో `భోళా శంకర్`, మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్` మరియు బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి.