వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఇప్పటిలో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎన్నికల సమయంలోనే పొత్తు ఉండేలా ఉంది. అయితే పొత్తుకు అధినేతలు రెడీగా ఉన్నా..రెండు పార్టీల కార్యకర్తలు రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండుసార్లు కలిశారు. వారి మధ్య పొత్తు గురించి చర్చలు నడిచినట్లే కనిపించాయి. ఇక పదే పదే పవన్..గౌరవప్రదంగా పొత్తు ఉంటుందని చెబుతున్నారు.
ఇటు చంద్రబాబు కూడా జనసేనతో పొత్తుకు రెడీగానే ఉన్నారు. కానీ ఇటు జనసేన శ్రేణులు పొత్తుల అంశంలో పెద్ద కోరికలు ఉన్నాయి. పవన్ కు సీఎం సీటు ఇవ్వాలని..ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న టిడిపి…10 శాతం ఓట్లు జనసేనకు సిఎం సీటు ఎలా ఇస్తుందని టిడిపి శ్రేణులు అంటున్నాయి. ఇదే క్రమంలో జనసేనకు 20-25 సీట్లు వరకు ఇస్తారని ప్రచారం నడుస్తోంది. ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారనేది క్లారిటీ లేదు. టిడిపి-జనసేన పొత్తు చెడగొడితే తమకు లాభమని వైసీపీ చూస్తుంది.
అందుకే ఆ రెండు పార్టీల పొత్తు చెడగొట్టడమే లక్ష్యంగా వైసీపీ వెళుతుంది. ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు సృష్టిస్తుంది. దీంతో కేడర్ లో కాస్త గొడవలు ఉన్నాయి. ఇక జనసేన శ్రేణులు గాని, అనుకూల మీడియా గాని..పొత్తు ఉంటే జనసేనకు 88 అసెంబ్లీ, 12 ఎంపీ సీట్లు, టిడిపికి 87 అసెంబ్లీ, 13 ఎంపీ సీట్లు అని ప్రచారం చేస్తున్నాయి.
అయితే ఇదేమి వర్కౌట్ అయ్యే పరిస్తితి కాదు..ఒకవేళ పవన్ ఈ స్థాయిలో డిమాండ్ చేయడం జరిగే పని కాదు..ఇదంతా జనసేన శ్రేణుల సృష్టి. ఒకవేళ ఇదే డిమాండ్ చేస్తే టిడిపి పొత్తుకు రెడీగా ఉండదు. ఒంటరి పోరుకే మొగ్గు చూపుతుంది. మొత్తానికి టిడిపి-జనసేన పొత్తు విషయంలో క్లారిటీ రావడం లేదు.