వీరాభిమాని మృతి.. సాయి ధ‌ర‌మ్ తేజ్ చేసిన ప‌నికి నెటిజ‌న్లు ఫిదా!

మెగా మేన‌ల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్ వీరాభిమానుల్లో ఒక‌రు నిన్న మృతి చెందాడు. భీమ‌వ‌రం సాయిధరమ్‌ తేజ్‌ ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌ అయిన రావురి పండు గుండెపోటుతో మరణించాడు. పండు వయసు 28 ఏళ్ళు మాత్రమే. క్రికెట్‌ ఆడుతుండగా హార్ట్ స్ట్రోక్ రావ‌డంతో.. చిన్న‌వ‌య‌సులోనే త‌న‌వు చాలించాడు.

ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ స్పందిస్తూ.. `రావూరి పండు అకాల మరణం మనసుకి చాలా బాధ కలిగిస్తుంది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి` అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఈ సంద‌ర్భంగా ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. తన అభిమాని మరణించాడని తెలిసి ఏకంగా టీజర్‌ లాంఛ్‌ను వాయిదా వేశాడు. బైక్ యాక్సిడెంట్ అనంత‌రం సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రం `విరూపాక్ష‌`. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో ఈ మూవీని తెరకెక్కించారు.

సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సంయుక్త మీన‌న్ ఇందులో హీరోయిన్ గా న‌టించింది. బుధవారం ‘విరూపాక్ష’ టీజర్‌ను రిలీజ్‌ చేయాలని ఎప్పుడో ప్లాన్‌ చేసుకున్నాడు. పైగా మంగళవారం పవన్‌కు స్పెషల్‌గా టీజర్‌ను చూపించి ఆయ‌న నుంచి అభినందనలు అందుకున్నాడు. కానీ, త‌న అభిమాని మరణించాడ‌ని తెలియ‌డంతో.. విరూపాక్ష‌ టీజర్ రిలీజ్ ని తేజ్ పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. పండు మృతికి నివాళులు ఆర్పిస్తూ టీజ‌ర్ ను వాయిదా వేస్తున్నామ‌ని మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. దీంతో అభిమానుల పట్ల సాయి ధరమ్ చూపిస్తున్న ప్రేమకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.