సినిమాల‌కు గుడ్‌బై.. ఫైన‌ల్ గా నోరు విప్పిన రానా!

దగ్గుబాటి రానా నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయిపోయింది. రానా చివరిగా విరాట పర్వం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విరాటపర్వం తర్వాత రానా నుంచి మరో సినిమా రాలేదు. పైగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో రానా దగ్గుపాటి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ప్రచారం ఊపందుకుంది.

తాజాగా ఈ విషయంపై రానా నోరు విప్పాడు. ప్రస్తుతం `రానా నాయుడు` వెబ్ సిరీస్‌ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడాయ‌న‌. ఈ నేపథ్యంలోనే రానా మాట్లాడుతూ.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. అయితే గ్యాప్ రావడానికి కారణం ఏంటి అనేది ఆయ‌న వివరించారు.

కెరీర్ ఆరంభంలో తనకంటూ ఒక గుర్తింపు రావడం కోసం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల్లో నటించాన‌ని, అయితే ఇప్పుడు తనకు ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది. అందుకే విభిన్నమైన కథల‌తో మాత్రమే ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్టు రానా తెలిపాడు. ప్రస్తుతం అటువంటి కథల‌ను ఎంచుకునే పనిలో ఉన్నానని.. అందుకే గ్యాప్ వస్తుందని ఆయన వెల్లడించాడు.