యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది నుంచి ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాస్తోంది. అలాగే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో కూడా నిలిచింది. `ఆర్ఆర్ఆర్`లోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ప్రస్తుతం అమెరికాలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే `నాటు నాటు` పాటు గురించి చరణ్ మాట్లాడాడు.
`ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ముందు నాటు నాటు పాటని షూట్ చేశాం. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా ఒకప్పుడు నటుడు కావడంతో షూటింగ్ కి తొందరగా ఓకే చెప్పారు.ఈ పాటలో దాదాపు 150 మంది డ్యాన్సర్లు, 200 మంది టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ పాటని తీయడానికి 17 రోజులు పట్టింది. కొన్ని స్టెప్పులకు నేను, ఎన్టీఆర్ ఒకేలా చేయడానికి చాలా టేక్స్ తీసుకున్నాం. ఈ పాట అయ్యేసరికి నేను నాలుగు కిలోల బరువు తగ్గాను. అంతలా ఈ పాట కోసం కష్టపడ్డాము. ఇప్పుడు నాటు నాటు పాట మాది మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రేక్షకులందరిది. జపాన్ నుంచి అమెరికా వరకు అందరూ నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు.` అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.