వైసీపీ ఫార్ములాతో కోటంరెడ్డి..తమ్ముడుకు టీడీపీ కండువా!

నెల్లూరు రూరల్ లో తొలిసారి టీడీపీకి పట్టు దొరకనుందా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎఫెక్ట్ తో రూరల్ లో వైసీపీకి చెక్ పడనుందా? అంటే ప్రస్తుతం పరిస్తితులని చూస్తే అదే జరిగేలా ఉంది. గత రెండు ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి విజయాలు అందుకుంటూ వచ్చారు. వైసీపీ నుంచి ఆయన సత్తా చాటారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కోటంరెడ్డి మంత్రి పదవి ఆశించారు..అది దక్కలేదు.

ఇక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు రావడం లేదు. అటు తన ఫోన్ని సొంత పార్టీ వాళ్ళే ట్యాపింగ్ చేయడంతో కోటంరెడ్డి అనుమానం ఉన్నచోట ఉండలేనని చెప్పి వైసీపీకి వీడ్కోలు పలికారు. ఇక అప్పటినుంచి ఆయన ఇండిపెండెంట్ గా ముందుకెళుతున్నారు. అయితే టి‌డి‌పిలో చేరాలని ఉందని ఆయన ఓపెన్ గానే చెప్పేశారు. కాకపోతే చంద్రబాబు ఇంకా కోటంరెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపించలేదు. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కడిగానే పోరాడుతూ..అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు.

ఇలా పోరాడుతున్న కోటంరెడ్డి టి‌డి‌పికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే కోటంరెడ్డిపై వైసీపీ వేటు వేయలేదు..దీంతో ఆయన ఇప్పుడే వైసీపీ వదిలే అవకాశం లేదు. ఎన్నికల ముందే టి‌డి‌పిలో చేరే ఛాన్స్ ఉంది. కానీ దానికంటే ముందు కోటంరెడ్డి తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని టి‌డి‌పిలో చేర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 24న కోటంరెడ్డి సోదరుడు టి‌డి‌పిలో చేరతారని తెలుస్తోంది. అయితే ఇక్కడ వైసీపీ ఫార్ములానే కోటంరెడ్డి ఫాలో అవుతున్నారు. టి‌డి‌పి నుంచి వైసీపీలోకి జంప్ కొట్టిన నలుగురు ఎమ్మెల్యేలు డైరక్ట్ గా వైసీపీ కండువాలు కప్పుకోలేదు.

తమ బంధువులకు, వారసులకు మాత్రమే కండువాలు కప్పించారు. ఇప్పుడు అదే పంథాలో కోటంరెడ్డి డైరక్ట్ చేరకుండా తన సోదరుడుని టి‌డి‌పిలో చేర్చనున్నారు.