అరెస్టుల పర్వం..తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!

తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలని అరెస్టుల పర్వం షేక్ చేస్తుంది. ఇంతకాలం ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ అధికార పార్టీలు రాజకీయం చేశాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..అధికార పార్టీ నేతలే ఇప్పుడు అనూహ్యంగా కేసుల్లో ఇరుక్కున్న పరిస్తితి. ఒకేసారి రెండు రాష్ట్రాల్లో కీలక నేతలు అరెస్టు అవుతారనే ప్రచారం సంచలనంగా మారింది. తెలంగాణలో సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత..ఇటు ఏపీలో సి‌ఎం జగన్ సోదరుడు, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కవిత పేరు పలుమార్లు వచ్చింది. సి‌బి‌ఐ సైతం ఆమెని విచారించింది. ఇప్పుడు ఈడీ విచారించడానికి సిద్ధమవుతుంది. ఇదే సమయంలో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే ఢిల్లీకి కే‌టి‌ఆర్ సైతం వచ్చారని తెలుస్తోంది. అయితే కవిత అరెస్ట్ అవుతుందని కే‌సి‌ఆర్ చెప్పేస్తున్నారు. . కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తూ, దర్యాప్తు సంస్థలతో వేధిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేసిన కే‌సి‌ఆర్..మంత్రులను వేధించారని,  మరికొందరు పార్టీ నేతలను వేధించారని అన్నారు.

ఇప్పుడు తన బిడ్డ దగ్గరకొచ్చారని, మహా అయితే కవితను అరెస్టు చేస్తారని, జైలుకు పంపిస్తారని, అంతేగదా! ఏం చేస్తారో చూద్దాం.. ఎవరికీ భయపడేది లేదని, బీజేపీపై పోరాటం ఆపేదే లేదని అన్నారు. అంటే కవిత అరెస్ట్ ఖాయమని కే‌సి‌ఆర్ డిసైడ్ చేసేశారు.

అటు వివేకా హత్య కేసులో ఇప్పటికే మూడుసార్లు సి‌బి‌ఐ..ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించింది. సి‌బి‌ఐ సైతం ఆయన్ని అరెస్ట్ చేయడం ఖాయమని తేల్చేసింది. ఇదే క్రమంలో తనని అరెస్ట్ చేయకుండా ఆపాలని తెలంగాణ హైకోర్టుకు అవినాష్ రెడ్డి వెళ్లారు. దీంతో సోమవారం అరెస్ట్ చేయవద్దని కోర్టు..సి‌బి‌ఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూడు రోజుల పాటు అవినాష్ అరెస్టుకు బ్రేకులు పడ్డాయని అంటున్నారు. మార్చి 14న సి‌బి‌ఐ ఎదుట హాజరు కావాలని కోర్టు సూచించింది. దీంతో ఆయన అరెస్ట్ ఖాయమని అంటున్నారు. మొత్తానికి అటు కవిత, ఇటు అవినాష్ అరెస్ట్ అయ్యేలా ఉన్నారు.