ఆ హీరో ఫ్యాన్స్ కి స‌మంత క్ష‌మాప‌ణ‌లు.. ఆ ప్ర‌చార‌మే నిజం కానుందా?

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత గ‌త కొంతకాలం నుంచి ఇంటికే పరిమితం అయింది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న ఆమె మ‌ళ్లీ తెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధమయింది. `ది ఫ్యామిలీ మెన్` సిరీస్ దర్శకులు రాజ్ మరియు డీకే దర్శకత్వంలో స‌మంత ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అదే `సిటాడెల్`. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా న‌టించ‌బోతున్నాడు.

 

అమెజార్ ప్రైమ్ వారు నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభ‌మైంది. స‌మంత ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా సమంత స్టైలిష్ లుక్ కు సంబంధించిన పోస్టర్ ను మేక‌ర్స్ విడుదల చేశారు. స‌మంత సైతం `సిటాడెల్`కు సంబంధించిన పోస్ట్ పెట్టింది. అయితే స‌మంత ఈ సిరీస్ చిత్రీక‌ర‌ణ‌లో భాగం కావ‌డంతో.. ఆమె విజ‌య్ దేవ‌ర‌కొండతో చేస్తున్న `ఖుషి` మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఈ ప్ర‌చార‌మే నిజం అయ్యేలా ఉంది.

ఖుషికి ప్రయారిటీ ఇవ్వకుండా సిటాడెల్ గురించి ప్రకటించడం విజయ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. దీనితో ఓ అభిమాని ఖుషి సంగతి ఏంటి అంటూ ప్రశ్నించాడు. అందుకు స‌మంత బ‌దులిస్తూ.. `ఖుషి చిత్రాన్ని కూడా త్వరలోనే తిరిగి ప్రారంభిస్తాం.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నన్ను క్షమించండి` అంటూ రిప్లై ఇచ్చింది. ఇది గ‌మ‌నించిన విజ‌య్.. `నీవు చిరునవ్వుతో పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని మేమంతా వెయిట్ చేస్తున్నాం` అంటూ సమంత ట్వీట్ ను రీట్వీట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే సమంత ఖుషీ షూటింగ్ లో పాల్గొనేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.