జగన్ కొత్త ట్విస్ట్..మంత్రివర్గంలో మార్పులు.!

ఏపీ మంత్రివర్గంలో ట్విస్ట్ ఉంటుందా…మరోసారి జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తారా? అంటే ఇటీవల మంత్రివర్గం మార్పులపై చర్చ నడుస్తున్న సందర్భంలో చిన్న మార్పు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వాస్తవ రూపం దాలుస్తుందా లేదా? అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే జగన్ రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేశారు. మొదటే 25 మందితో ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

మధ్యలో మండలి రద్దు అని చెప్పి ఎమ్మెల్సీలుగా ఉన్న పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని మంత్రివర్గం నుంచి తప్పించి..వారిని రాజ్యసభకు పంపి..మంత్రివర్గంలో చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులని చేర్చుకున్నారు. ఇక మధ్యలో సగం మంది మంత్రులని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. పాత, కొత్త కలయికతో మంత్రివర్గం ఏర్పాటైంది. అయితే ఇప్పుడు మరోసారి మంత్రివర్గ విస్తరణ చేస్తారని ప్రచారం వస్తుంది.

ప్రస్తుత కేబినెట్ లో అయిదుగురు మంత్రులపై వేటు పడనుందని సమాచారం. అయితే ఈ ఐదు స్థానాలని ఎమ్మెల్సీలతో భర్తీ చేయనున్నారని సమాచారం. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక వారు కూడా వచ్చాక..మంత్రివర్గంలో మార్పులు చేస్తారని తెలుస్తోంది. అయితే పార్టీ కోసం సేవ చేసి..పదవులు దక్కని వారికి ఈ సారి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

అటు పార్టీ ఇటు ప్రభుత్వంలో అనుభవం ఉన్న వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులుగా తీసుకోవాలని నిర్ణయించిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత కేబినెట్ విస్తరణకు అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జగన్ ఎవరి పైన వేటు వేస్తారు..ఎవరికి కేబినెట్ లో సీటు ఇస్తారనేది చూడాలి.