నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం `అమిగోస్` మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తే.. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు.
ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటానని కళ్యాణ్ రామ్ ధీమాగా ఉన్నాడు. ఇకపోతే `ధర్మ క్షేత్రం`లో బాలకృష్ణ, దివ్య భారతిపై తెరకెక్కించిన `ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా` సాంగ్ ను `అమిగోస్` సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ బయటకు వచ్చిన ఈ సాంగ్ అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ఈ సాంగ్ ను చిత్రీకరించేందుకు మేకర్స్ ఎన్ని రాత్రుళ్లు కష్టపడ్డారో తెలిస్తే షాకైపోతున్నారు.
ఎందుకంటు, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 రోజులు ఈ సాంగ్ కోసం శ్రమించారట. ధర్మక్షేత్రం సినిమాలో ఈ పాటను ఇళయరాజా స్వర పరచగా.. అమిగోస్ సినిమాలో జీబ్రాన్ స్వరపరిచారు. ధర్మక్షేత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, మనో, జానకి, చిత్ర పాడిన ఆ పాటను.. అమిగోస్ లో బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. అలాగే ఆ సాంగ్ కు డ్యాన్స్ మాస్టర్ శోభి కొరియోగ్రఫీ చేయగా.. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ అందించారు. ఈ పాట కోసం వేసిన సెట్టింగ్ అద్భుతం అనే చెప్పాలి. కళ్యాణ్ రామ్, అశికా పోటీ పడి డ్యాన్స్ చేశారు. మొత్తానికి అదిరిపోయిన ఈ సాంగ్ సినిమాకే ఒక ఆకర్షణగా నిలవనుంది.