ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలావరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన దెబ్బతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక ఆ పార్టీలో ఉండే నేతలు టీడీపీ, వైసీపీల్లోకి వెళ్లిపోయారు. 2014 ఎన్నికల ముందు చాలామంది నేతలు ఆ రెండు పార్టీల్లో చేరారు. ఇక 2019 ఎన్నికల ముందు కూడా కొందరు కాంగ్రెస్ నేతలు జంప్ అయ్యారు. ఇప్పుడు పార్టీలో కొంతమంది నేతలు మాత్రమే ఉన్నారు.
అయితే వచ్చే ఎన్నికల ముందు కూడా కొందరు నేతలు జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో సీనియర్లు అయిన మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ హర్షకుమార్..ఈ ఇద్దరు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల ఏపీ పిసిసి అధ్యక్ష పదవి గిడుగు రుద్రరాజుకు దక్కడంపై ఇరువురు నేతలు అసంతృప్తిగానే ఉన్నారు. తనని పిసిసి నుంచి తొలగించడంతో శైలజానాథ్ పార్టీలో యాక్టివ్ గా ఉండటం లేదు. అటు హర్షకుమార్ సైతం కీలక పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు.
ఇదే సమయంలో శైలజానాథ్ టీడీపీలోకి రావడానికి చూస్తున్నారని తెలిసింది. ఎలాగో కాంగ్రెస్ లో ఉంటే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకం అవుతుంది..అందుకే ఆయన టిడిపిలోకి వచ్చి శింగనమల సీటులో పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. అక్కడ టిడిపి నాయకురాలు శ్రావణి ఉన్నారు. అయితే ఆమె బదులు శైలజానాథ్ని బరిలో దింపితే శింగనమలలో టిడిపికి ప్లస్ అవుతుందని, పైగా జేసీ ఫ్యామిలీతో శైలజానాథ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఇటు అమలాపురం పార్లమెంట్ నుంచి బాలయోగి వారసుడు హరీష్ని పి.గన్నవరం ఇంచార్జ్ గా పంపారు. అయితే హర్షకుమార్ కోసమే అమలాపురంని ఖాళీ చేశారని తెలుస్తోంది. హర్షకుమార్ లేదా ఆయన తనయుడు శ్రీరాజ్ అమలాపురం పార్లమెంట్ లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.