`పుష్ప 2` త‌ర్వాత ఆ డైరెక్ట‌ర్ కి ఓటేసిన బ‌న్నీ.. వ‌ద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్‌!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన `పుష్ప ది రైజ్‌` ఘ‌న‌ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎర్రచందనం స్మ‌గ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్‌ మీదకు వెళ్ళింది. ఇక‌పోతే ఈ సినిమా అనంతరం బన్నీ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో ఉంటుందనే చర్చ ఎప్పటినుంచో సాగుతోంది.

అయితే బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఓటేశాడని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. ఓ మంచి క‌థ సిద్ధం చేయ‌మ‌ని కూడా చెప్పాడ‌ట‌. ఇది విన్న బ‌న్నీ అభిమానులు వద్దు బాబోయ్ అంటూ ర‌చ్చ చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. త్రివిక్రమ్ గత కొంతకాలం నుంచి తన సినిమాల కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు.

 

పవన్ తో ఉన్న స‌న్నిహిత్యం కార‌ణంగా ఆయ‌న‌ చేస్తున్న ప్రతి సినిమా బాధ్యతలను దగ్గర నుండి చూసుకుంటున్నాడు. తన సినిమాలను గాలికి వదిలేశాడు. `అల వైకుంఠపురంలో` తర్వాత త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు. ఇటీవలే మహేష్ బాబుతో ఓ మూవీని ప్రారంభించాడు. కానీ ఈ మూవీ షూటింగ్ నత్త‌నడక నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే త్రివిక్ర‌మ్ తో సినిమా వద్దు అంటూ బన్నీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.