అధికార వైసీపీకి సర్వేల టెన్షన్ పెరిగిపోయింది..ఇటీవల బయటకొచ్చే ప్రతి సర్వే కూడా వైసీపీకి నెగిటివ్ గానే ఉంటుంది. వైసీపీ బలం ఎక్కువ తగ్గిందని, చాలా సీట్లు కోల్పోయిందని సర్వేల్లో వస్తుంది. ఇదే క్రమంలో వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్న ఐప్యాక్ టీమ్ సర్వే కూడా బయటకొచ్చిందని తాజాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది కూడా మంత్రులు, మాజీ మంత్రులకు సంబంధించిన సర్వే వెలువడింది.
ఇక దీనిపై మీడియా కూడా పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చింది. అయితే ఆ సర్వేలో వైసీపీకి షాక్ ఇచ్చే ఫలితాలు కనబడ్డాయి. 25 మంత్రుల్లో కేవలం 5 గురు మంత్రులు మాత్రమే ఆధిక్యంలో ఉన్నారని, మిగిలిన మంత్రులు వెనుకబడి ఉన్నారని సర్వేలో స్పష్టమైంది. మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, దాడిశెట్టి రాజా, విశ్వరూప్, అంజాద్ బాషాలు మాత్రమే ఆధిక్యంలో ఉన్నారని మిగిలిన వారు వెనుకబడి ఉన్నారని ఆ లీక్ సర్వేలో తేలింది. అంటే బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వారు సైతం ఆధిక్యంలో లేరని సర్వేలో స్పష్టమైంది.
అటు మాజీ మంత్రుల్లో కేవలం కొడాలి నాని, ధర్మాన కృష్ణ దాస్లు మాత్రమే లీడ్ లో ఉన్నారని తేలింది. ఇక ఈ సర్వేని టీడీపీ సోషల్ మీడియా, మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లాంటి వారు సైతం ఆ సర్వే నిజమనే చెప్పుకొచ్చారు. ఈ అనూహ్య పరిణామాల మధ్య ఐప్యాక్ సంస్థ స్పందించి..ఆ సర్వేలో నిజం లేదని, అసలు అది తమ సర్వే కాదని చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. మొత్తానికి మాత్రం ఆ లీక్ సర్వే వైసీపీని కాస్త టెన్షన్ పెట్టిందనే చెప్పాలి.