నా బాధ‌కు, కోల్పోయిన వాటికి అదే మందు.. వైర‌ల్ గా మారిన స‌మంత పోస్ట్‌!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజుల నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూ ఆ వ్యాధి బారి నుంచి బ‌య‌టప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుందని అంటున్నారు. త్వరలోనే ఆమె తిరిగి కెమెరా ముందుకు రాబోతోందని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారానికి సమంత పెట్టిన తాజా పోస్ట్ మరింత బలాన్ని చేకూర్చుంది. సమంత నటించిన పౌరాణిక చిత్రం `శాకుంతలం` విడుదల‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో స‌మంత, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ జంట‌గా న‌టించారు.

అద్భుత‌మైన ప్రేమ‌కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేమికుల కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. మేక‌ర్స్‌ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నారు. తాజాగా సమంత తన పాత్రకు డబ్బింగ్ చెప్ప‌డం ప్రారంభించింది. డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సమంత ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. `నా పిచ్చికి, బాధకు, ప్రపంచంలో కోల్పోయిన వాటికి కళనే మందు. దాని సహాయంతో నేను నా గమ్యానికి చేరుకుంటాను` అని స‌మంత ఈ సంద‌ర్భంగా పేర్కొంది. దీంతో స‌మంత పోస్ట్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారింది.