నాగార్జున‌కే చుక్క‌లు చూపించిన డ‌బ్యూ డైరెక్ట‌ర్‌.. టాలీవుడ్‌లోనే తొలిసారి ఇలా!?

అక్కినేని మన్మధుడు నాగార్జున సోలోగా హిట్ అందుకుని చాలా కాలం అయిపోయింది. ఈయన నుంచి చివరిగా వచ్చిన `ది ఘోస్ట్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ మూవీ అనంతరం నాగార్జున సినిమా ఎవ‌రితో చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇది నాగార్జున కెరీర్ లో తెర‌కెక్కబోయే 99వ ప్రాజెక్ట్. అయితే ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నాగార్జున ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు.

ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ర‌చ‌యిత బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్‌తో నాగార్జున ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. సినిమా చూపిస్తా మావ‌, నేను లోక‌ల్‌, ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడా, రీసెంట్ గా ధ‌మాకా చిత్రాల‌తో ర‌చ‌యిత‌గా విజ‌యాల్ని అందుకున్నాడు ప్ర‌స‌న్న‌కుమార్‌. అయితే ప్రసన్న కుమార్ రాసిన కథ బాగా న‌చ్చ‌డంతో, అతనిని దర్శకుడిగా ప‌రిచ‌యం చేసేందుకు నాగార్జ‌న రెడీ అయ్యాడు. వీరి ప్రాజెక్ట్ దాదాపు క‌న్ఫార్మ్ అయింద‌ట‌.

కానీ, `ధమాకా` సూపర్ హిట్ తో ప్రసన్న కుమార్ భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసి నాగార్జున‌కే చుక్క‌లు చూపించాడ‌ట‌. రచన మరియు దర్శకత్వం వహించడానికి నాగార్జున అతనికి మొదట రూ. 50 లక్షలు ఆఫర్ చేశాడ‌ట‌. అయితే ధమాకా విజయం చూసి ప్ర‌స‌న్న కుమార్ ఏకంగా రూ. 2 కోట్లు అడిగాడ‌ట‌. అంత మొత్తం ఇచ్చేందుకు నాగార్జున మొద‌ట నో చెప్పినా.. ఆ త‌ర్వాత‌ అంగీకరించ‌క త‌ప్ప‌లేద‌ని టాక్ న‌డుస్తోంది. మొత్తానికి ఓ డెబ్యూ డైరెక్టర్ కోట్లలో పారితోషికం అందుకోవడం టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి.