బాహుబలి తరువాత ప్రభాస్ జాతకం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయి రేంజ్ రావడంతో వరుస పెద్ద పెద్ద సినిమాలు క్యూలు కట్టాయి. అయితే తరువాత చేసిన సినిమాలు ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. బాహుబలి విజయం తరువాత చేసిన సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేసినప్పటికీ అవన్నీ ఆశించినంత స్థాయిలో ఆడలేదు. బాహుబలి తరువాత డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ చేసిన సాహో అనే మూవీ ఆశించినంత స్థాయిలో విజయం అందుకోలేదు. అయితే సాహో మూవీ ఇక్కడ యావేరేజ్ టాక్ వచ్చినా, బాలీవుడ్లో మాత్రం కలెక్షన్స్ వర్షం కురుపించింది.
ఆ తరువాత డైరెక్టర్ కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేసిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధేశ్యామ్ అయితే ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. దాంతో డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులు ఏయే అంశాలు కోరుకుంటున్నారో అలోచించి తాను చేయబోయే సినిమాల కధల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలను ప్రకటించాడు. దాంతో అందరి చూపులు ఇపుడు ఆయా ప్రాజెక్ట్స్ పైనే వున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ మూవీ.
ఆదిపురుష్ సినిమా కాకుండా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సలార్ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని తరువాత అంతకంటే పెద్ద స్థాయిలో మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రాజెక్ట్ Kలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా 2024లో రిలీజ్కు రెడీ అవుతున్నా, ఇప్పటి నుంచే ఆడియన్స్ను విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తోంది. అంతేకాకుండా ప్రభాస్ – మారుతీ కాంబినేషన్ మరోవైపు ఉండనే వుంది. అంటే దాదాపు నాలుగు సినిమాలతో ప్రభాస్ తన అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఏదిఏమైనా ప్రభాస్ కి ముఖ్యంగా 2024 చాలా కీలకం కానుందని, డార్లింగ్ భారతీయ సినిమా చరిత్రలో మరో మెట్టు ఎక్కనున్నాడని అంటున్నారు స్టార్ డైరెక్టర్స్.