నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఒంగోలులో `వీర సింహారెడ్డి` ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతో సందడిగా సాగింది. అయితే ఈ ఈవెంట్లో బాలయ్య మనవడికి సంబంధించిన ఓ చిన్న వీడియోను ప్లే చేశారు.
ఇందులో తేజస్విని కుమారుడు ఆర్యవీర్ `వీర సింహారెడ్డి` మూవీలోని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. బాలయ్య యాక్షన్ అనగానే.. `భయం నా బయోడేటాలో లేదురా` అంటూ తాత డైలాగ్ ను రీక్రియేట్ చేశాడు. మనవడి వీడియోను చూసి బాలయ్య తెగ మురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది.