ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం 4:00 గంటల సమయంలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాదులో కన్నుమూశారు.ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన కైకాల సత్యనారాయణ.. గత రెండు రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈరోజు ఉదయం ఆయన తుదిస్వాస విడిచినట్లు సమాచారం. ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 60 సంవత్సరాల పైగానే అవుతోందని చెప్పాలి.
60 సంవత్సరల సినీ జీవిత కాలంలో పౌరాణిక , సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలలో నటించి హాస్య, ప్రతినాయక, నాయక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. అలా మొత్తంగా 777 సినిమాలలో నటించి రికార్డు సృష్టించారు. నవరస నటన సార్వభౌమ అనే బిరుదు కూడా పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అంతటి వైవిద్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన కూడా ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. 1959లో సిపాయి కూతురు అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన కైకాల సత్యనారాయణ ఎక్కువగా విలన్ పాత్రలు పోషించాడు.
నాగేశ్వరమ్మ అనే ఆవిడను వివాహం చేసుకున్న తర్వాత వీరికి నలుగురు పిల్లలు జన్మించారు . అందులో కైకాల లక్ష్మీనారాయణ, కైకాల రామారావు, కైకాల రమాదేవితో పాటు మరో కూతురు కూడా జన్మించింది. ఎన్నో చిత్రాలలో నటించి మరెన్నో అద్భుతాలు సృష్టించిన కైకాల సత్యనారాయణ పార్లమెంటు మాజీ సభ్యుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు . అటు రాజకీయంగా ఇటు సినీ రంగంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఈరోజు మరణించడంతో ప్రతి ఒక్కరు ఈయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా ఇంతటి గొప్ప నటుడు మళ్లీ ఇండస్ట్రీలో తారసపడతారో లేదో..