ఒంగోలులో మారుతున్న లెక్కలు..దామచర్లకు అదే ప్లస్.!

రాష్ట్రంలో ఆసక్తికరమైన ఫైట్ జరిగే నియోజకవర్గాల్లో ఒంగోలు అసెంబ్లీ కూడా ఒకటి అని చెప్పొచ్చు..ఇక్కడ కీలకమైన కమ్మ, రెడ్డి వర్గం నేతల మధ్య పోరు జరుగుతుంది. వైసీపీ నుంచి సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నుంచి దామచర్ల జనార్ధన్‌ బరిలో దిగుతున్నారు. గత రెండు ఎన్నికల్లో వీరే ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. 2014లో బాలినేనిపై దామచర్ల పై చేయి సాధించారు.

2019 ఎన్నికల్లో మాత్రం మళ్ళీ బాలినేని సత్తా చాటారు. అలాగే రెండున్నర ఏళ్ళు మంత్రిగా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ మూడున్నర ఏళ్లలో ఇక్కడ చాలా లెక్కలు మారాయి. వాస్తవానికి ఒంగోలులో బాలినేనికి ఫాలోయింగ్ ఎక్కువ. పార్టీ పరమైన ఓటు బ్యాంక్‌తో పాటు సొంత ఓటు బ్యాంక్ ఉంది..పైగా ఆర్ధిక పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. దీంతో బాలినేనికి తిరుగులేదనే పరిస్తితి.

కాకపోతే సంక్షేమం అందిస్తున్నారు గాని, సరైన అభివృద్ధి చేయకపోవడం, అక్రమాలు ఎక్కువ జరిగాయని ఆరోపణలు రావడం, సొంత పార్టీలోనే బాలినేనికి వ్యతిరేక వర్గాలు ఉండటం బాగా నెగిటివ్ అవుతున్నాయి. ఇక ఇక్కడ దామచర్లకు మంచి ఫాలోయింగ్ ఉంది..టీడీపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. అలాగే 2014 ముందు వరకు ఒంగోలు వేరు..2014 తర్వాత వేరు అన్నట్లుగా దామచర్ల ఒంగోలుని అభివృద్ధి చేశారనే ముద్ర ఉంది. ఇప్పుడు అదే దామచర్ల వైపు ప్రజలు చూసేలా చేస్తుంది. ఇప్పుడు సరిగ్గా అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు మరోసారి ఆయన అభివృద్ధిపై మాట్లాడుకుంటున్నారు.

అయితే చేసిన పనులు చెప్పుకోలేకపోవడం, ఓడిపోయాక కొన్ని రోజులు యాక్టివ్ గా లేకపోవడం, ఆర్ధిక పరంగా ఇబ్బందులు పెట్టడం దామచర్లకు మైనస్ అవుతున్నాయి. కానీ దామచర్ల పై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అభివృద్ధి చేయడం ప్లస్..అదే సమయంలో ఇక్కడ జనసేనకు 10 వేల ఓటు బ్యాంక్ ఉంది..పొత్తు ఉంటే అది దామచర్లకు ప్లస్ అవుతుంది. లేదంటే ఈ సారి ఒంగోలులో బాలినేని-దామచర్ల మధ్య హోరాహోరీ ఫైట్ జరగనుంది.