వీరసింహా-వీర‌య్య‌లు ఇంత స్లోగా ఉంటే దెబ్బ ప‌డ‌టం ఖాయం!

వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బాలయ్య గోపీచంద్ మ‌లినేనితో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. `వీర సింహారెడ్డి` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అలాగే చిరంజీవి విషయానికి వస్తే.. డైరెక్టర్ బాబి తో ఈయన `వాల్తేరు వీరయ్య` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులోనూ శ్రుతిహాసన్ నే హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేక‌ర్స్ వారే నిర్మిస్తున్నారు. అయితే విడుదలకు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. ఈపాటికే ప్రచార కార్యక్రమాలు షురూ చేయాల్సి ఉంది.

కానీ అటు వీరయ్య, ఇటు వీర సింహారెడ్డి ఇద్దరూ చివరి దశ షూటింగులతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఈ రెండు చిత్రాల‌కు పోటీగా దిగుతున్న విజయ్ `వారసుడు` నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదలై యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే వీరసింహ, వీరయ్యలు ఇంత స్లోగా ఉంటే దెబ్బ పడటం ఖాయమంటూ సినీ విశేషకులు భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా వరుస అప్డేట్లతో చిరు, బాలయ్యలు తమ సినిమాలపై హైప్ పెంచుతారా? లేదా? అన్నది చూడాలి.