కర్నూలులో ట్విస్ట్..బడా నేతల ‌ఎక్స్‌చేంజ్..!

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది..పూర్తిగా వైసీపీ ఆధిక్యంలో ఉన్న జిల్లాలో టీడీపీ బలపడటానికి అవకాశం వచ్చింది. గత మూడున్నర ఏళ్లుగా టీడీపీ నేతలు పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు..కానీ అనుకున్న స్థాయిలో పార్టీ పుంజుకోలేదు..అయితే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ వచ్చింది.

ఇదే సమయంలో చంద్రబాబు జిల్లా పర్యటన చేపట్టడం, ఆ పర్యటనకు భారీ ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు లాంటి నియోజకవర్గాల్లో బాబు పర్యటనకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇక ఈ ఊపుని కొనసాగించాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీకి చెందిన కొందరు నేతలని టీడీపీలో చేర్చుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి టీడీపీతో పోలిస్తే వైసీపీకే నాయకత్వ బలం ఎక్కువ..ఆ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు..దీంతో కొందరు బలమైన నేతలకు టీడీపీ గేలం వేసిందని తెలిసింది. ఈ క్రమంలోనే వైసీపీలో సీటు కష్టమనుకునే ఓ బడా నేతపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయన్ని టీడీపీలోకి తీసుకొచ్చి సీటు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇంకా కొందరు నాయకులని టీడీపీలోకి లాగాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే రివర్స్‌లో వైసీపీ సైతం..టీడీపీకి చెందిన ఓ బడా ఫ్యామిలీని వైసీపీలోకి లాగాలని చూస్తున్నట్లు తెలిసింది.

2019 ఎన్నికల ముందే టీడీపీలో చేరిన ఆ  ఫ్యామిలీని తీసుకుంటే వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఆ బడా నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అని చర్చ నడుస్తోంది. ఇప్పటికే కోట్లతో ఫ్యామిలీతో పలుమార్లు చర్చలు కూడా చేసినట్లు సమాచారం..ఎంపీ సీటుతో పాటు ఎమ్మెల్యే సీటు ఆఫర్ చేశారట. కానీ ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారట. ఇప్పటికే పార్టీ మారమని, మరోసారి మారితే తమ ఫ్యామిలీ క్రెడిబిలిటీ దెబ్బతింటుందని, అయినా చంద్రబాబు తమకు ప్రాధాన్యత ఇస్తున్నారని, టీడీపీని వీడమని చెప్పేశారట. మొత్తానికి రానున్న రోజుల్లో టీడీపీలోకే వలసలు జరిగేలా ఉన్నాయి.