కేసీఆర్ ఎత్తులు..జగన్ ప్రభుత్వం కూలుతుందా?

రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి..ఆయన వ్యూహాలని ప్రత్యర్ధులు కనిపెట్టడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆయన పైకి ఒక మాట మాట్లాడితే..దాని వెనుక చాలా వ్యూహాలు ఉంటాయి. అవి అర్ధం కావడం చాలా కష్టం. తాజాగా టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై..ప్రెస్ మీట్ పెట్టి..మోదీ, అమిత్ షాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి..బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన ఆడియో, వీడియోలు బయటకొచ్చాయి. తాజాగా కేసీఆర్..ఇంకా ఎక్కువ వీడియోలు చూపించారు. పైనున్న మోదీ, అమిత్ షాల సపోర్ట్‌తోనే ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతుందని, ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలని కూల్చివేశారని, ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమవుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వారిని శిక్షించాలని గట్టిగానే మాట్లాడారు.

అయితే ఇదంతా కేసీఆర్ మాటలు..కానీ లోపల ఆయన ప్లాన్ వేరు..దీని ద్వారా కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టి..తన రాజకీయ భవిష్యత్‌ని మెరుగుపర్చుకోవాలని చూస్తున్నారు. బేరం నడిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి లాక్కున్నవారే. వీరే కాదు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలని కేసీఆర్ లాక్కున్నారు. ఎమ్మెల్యేలని లాగిన కేసీఆర్..ఇప్పుడు బీజేపీ లాగడానికి చూస్తుందని చెప్పడం కాస్త విడ్డూరం.

ఇక తమతో పాటు ఏపీ, ఢిల్లీ, రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాలని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చారు. ఇందులో ఢిల్లీ, రాజస్తాన్‌లకు సంబంధించి కేసీఆర్ కొత్తగా చెప్పేదేమీ లేదు..ఆ రాష్ట్రాలపై బీజేపీ ఎప్పటినుంచో ఫోకస్ చేసింది. కానీ ఇందులో కొత్తగా ఏపీని కలిపారు. అసలు అక్కడ జగన్ ప్రభుత్వం కూల్చడం అయ్యే పని కాదు..పైగా జగన్..బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఆయన బీజేపీకి ఎదురుతిరుగులేదు. అలాగే భారీగా సీట్లు ఉన్నాయి..అక్కడ బీజేపీ బలం శూన్యం. కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదు.

కానీ కేసీఆర్ అలా చెప్పడానికి కారణం ఉంది..ఎలాగో జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారు కాబట్టి..బీజేపీని టార్గెట్ చేసి..ఏపీ ప్రజల మద్ధతు పొందడానికి చూస్తున్నారు. అలాగే జగన్ కూడా బీజేపీని దూరం పెట్టి, తమతో కలుస్తారనే స్కెచ్. కానీ ఇవేమీ వర్కౌట్ కావు..ఎందుకంటే ఏపీ ప్రజలు కేసీఆర్‌ని ఆదరించడం జరిగే పని కాదు.