చివరికి యాంకర్‌గా మారిన దిల్ రాజు.. ఆ మూవీ టీమ్‌కి ఎడాపెడా ప్రశ్నలు..

దర్శకుడు సాయి కుమార్ దర్శకత్వం వహించిన ‘మసూద’ సినిమా ఒక చిన్న సినిమాగా నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. విడుదలని మొదటి రోజు నుంచి మంచి టాక్ సంపాదించుకొని రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో మసూద సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సపోర్ట్ చేశాడు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మసూద చిత్ర బృందంతో కలిసి వీడియో సమావేశాన్ని నిర్వహించాడు.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు యాంకర్ అవతారం ఎత్తాడు. సినిమా బృందాన్ని పలు ప్రశ్నలు వేస్తూ ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించిన యంగ్ నిర్మాత రాహుల్ యాదవ్ ను ప్రశంసిస్తూనే, సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అడిగి తెలుసుకున్నారు. “ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసిన అనుభవం ఉన్న నేను 2 గంటల 45 నిమిషాల నిడివి గల సినిమాలో కాస్త టైమ్‌ తగ్గించాలని అడిగాను. అందుకు నువ్వు కుదరదు అని చెప్పావు. అసలు ఏంటి నీ ధైర్యం?” అని సూటిగా ఒక ప్రశ్న వేశాడు.

రాహుల్ యాదవ్ సమాధానం ఇస్తూ.. “స్క్రిప్ట్ విన్న తర్వాత దాంట్లో ఉన్న అసలైన సోల్ ఎట్టి పరిస్థితులలోనూ మనం పోగొట్టకూడదు. నేను ఈ స్క్రిప్ట్ ఒప్పుకోవడానికి కారణం ఇందులోని హారర్ ఎలిమెంట్స్. అలానే అవసరం ఉన్న వ్యక్తులకి సహాయం చేయడానికి ఎలాంటి కారణాలు వెతుక్కోనక్కర్లేదనే మెసేజ్‌ను ఈ సినిమా స్క్రిప్ట్ ద్వారా తెలియజేయాలి. ఈ రెండు అంశాలను నిజాయితీగా తెరపై చూపించాలని అనుకున్నాను. అందుకే సీన్స్ కట్ చేయలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయలేదు” అని పేర్కొన్నాడు.

ఈ సమాధానం విన్న తర్వాత దిల్ రాజు అతని గట్స్‌ను మెచ్చుకున్నాడు. ఇది తన సొంత సినిమా అయ్యుంటే దీనిని 15 నిమిషాల పాటు కట్ చేసి ఉండేవాడినని పేర్కొన్నాడు. అందుకు బదిలిస్తూ ఇది రియల్ డ్రామా అని.. అందుకే మూవీ లెంత్ గురించి తానేమీ పెద్దగా పట్టించుకోలేదని రాహుల్ చెప్పుకొచ్చాడు. టీవీ, ఓటీటీ ఆఫర్స్ వచ్చినా.. తన మీద, తన స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో తాను సినిమాని వాటికి అమ్మలేదని.. డైరెక్ట్ గా థియేటర్స్‌లో రిలీజ్ చేశానని రాహుల్ వెల్లడించాడు.