బాబు పక్కా స్కెచ్..వైసీపీ గ్రాఫ్ డౌన్?

రాష్ట్రంలో ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేస్తున్నారు. ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే..టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే ఈ సారి జగన్‌కు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని చెప్పి బాబు ట్రై చేస్తున్నారు. అయితే బాబు అనుకున్న విధంగా టీడీపీ నేతలు కష్టపడటం లేదు. ఇప్పటికే వరుసపెట్టి ఇంచార్జ్‌లతో భేటీ అవుతూ, సరిగ్గా పనిచేయని వారికి క్లాస్ పీకుతూ వచ్చారు.

అలాగే బాదుడే బాదుడే కార్యక్రమం నిర్వహించడంలో పలువురు నేతలు విఫలమవుతున్నారు. అందుకే బాబు డైరక్ట్‌గా రంగంలోకి దిగి..ప్రజలపై జగన్ ప్రభుత్వం వేస్తున్న పన్నుల భారంపై పోరాటం చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ మధ్య వర్షాల వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో..బాబు మళ్ళీ రంగంలోకి దిగారు. జనంలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 4వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇక దాదాపు రెండు నెలల పాటు బాబు జనంలోనే ఉండనున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతని తమకు అనుకూలంగా మార్చుకోవడమే లక్ష్యంగా బాబు ముందుకెళ్లనున్నారు. అలాగే ఓ స్కెచ్ ప్రకారం కార్యక్రమాలు రూపొందించనున్నారు.  పర్యటనలు మరింత పకడ్బందీగా నిర్వహించే నిమిత్తం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు సహ కన్వీనర్‌గా ఉంటారు.

అలాగే సంక్రాంతి తర్వాత నారా లోకేష్ చేత పాదయాత్ర చేయించడానికి కూడా రెడీ అవుతున్నారు. కుప్పం నుంచి మొదలయ్యే ఈ పాదయాత్ర ఏడాది పాటు జరగనుంది. ఇలా ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటూ..వైసీపీ గ్రాఫ్ తగ్గించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత పనిచేయనున్నారు. మరి బాబు స్కెచ్ ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి.